సొంత మండలంలో ఈటెలకు షాక్: మంత్రి గంగులను కలిసిన ప్రజాప్రతినిధులు

By telugu teamFirst Published May 16, 2021, 2:00 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు తన సొంత మండలంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈటెల మండలంలోని ప్రజాప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు.

కరీంనగర్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సొంత మండలంలోనే షాక్ తగిలింది. ఈటెల రాజేందర్ సొంత మండలం ప్రజాప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు.ఈటల బర్తరఫ్ తో తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని గంగులను కలిసిన ప్రజా ప్రతినిధులు అన్నారు. 

విభజించి పాలించి విధనంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఈటెల రాజేందర్ అణగదొక్కారని, అభివ్రుద్దిని కుంటుపర్చాడని వారన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని సొంతంగా ఎదిగి, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

నిరంతరం అందుబాటులో ఉండి అభివృద్ధికి అండగా ఉంటానని గంగుల కమలాకర్ వారికి హామీ ఇచ్చారు.  మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో హుజురాబాద్ నియోజకవర్గం, కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని శనిగరం ,మరిపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు తెరాస సీనియర్ నాయకులు పింగళి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో శనిగరం సర్పంచ్ పింగళి రవళిరంజిత్ రెడ్డి, ఉపసర్పంచ్ మేకల తిరుపతి, సీనియర్ నేత చెరిపెల్లి రాంచందర్ తో పాటు చాలా మంది స్థానిక నేతలు శనివారంనాడు  కలిశారు. 

తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను మంత్రి గంగులకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈటెల తన పదవిని, పార్టీలో తన స్థానాన్ని అడ్డుపెట్టుకొని హుజురాబాద్లో ద్వితియ శ్రేణీ నాయకత్వాన్ని అణిచివేశాడని తమ గోడును వెల్లబోసుకున్నారు, డివైడ్ అండ్ రూల్ ఫాలసీతో పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేశాడని మండిపడ్డారు. 

కేవలం తన స్వార్థంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి అనేక అక్రమాస్తులు సంపాదించాడని, నియోజకవర్గ అభివ్రుద్దిని గాలికొదిలేసి అరకొరగా పనులు చేసాడని తద్వారా నియోజకవర్గంలో అనేక సమస్యల్ని పరిష్కరించుకోలేక పోయామని, వీటిని పార్టీ, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకురావడానికి ప్రయత్నించిన కార్యకర్తల్ని అణిచివేశారని మండిపడ్డారు. 

నేడు అధికార పదవులనుండి ఈటెల భర్తరఫ్ తో తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టయిందని సంతోషం వ్యక్తం చేశారు ఈటెల సొంత మండలానికి చెందిన నేతలు. పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త కూడా రాజెందర్ వెంట లేరని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా శనిగరం, మరిపెల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని మంత్రి గంగుల కమలాకర్ ద్రుష్టికి తీసుకువచ్చారు నేతలు. గతంలో ఈటెల నిర్లక్ష్యంతో వెనుకకుపోయిన భగీరథ ఎత్తిపోతల స్కీంను రైతుల కాంట్రిబ్యూషన్ కింద పునరుద్దరణ చేయించాలని విజ్ణప్తి చేశారు. ఈ గ్రామాల్లోని చెక్ డ్యాంల వరకూ రోడ్ల నిర్మాణంతో పాటు పెండింగ్లో ఉన్న సీసీరోడ్లను మంజూరు చేయాలని విజ్ణప్తి చేశారు. 

అలాగే ప్రియతమ నేత కేటీఆర్ నియోజకవర్గానికి వస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తుందని, తమ ఐక్యతని ప్రదర్శిస్తామని సైతం విజ్ణప్తి చేశారు. శనిగరం, మరిపెల్లి గ్రామాల నేతల సమస్యలను సావధానంగా విన్న మంత్రి గంగల కమలాకర్, వాటి పరిష్కారం కోసం తక్షణమే కార్యాచరణ రూపొందిస్తానని హామీనిచ్చారు.
           
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు, ఎవరూ అధైర్య పడవద్దని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, తాను హుజురాబాద్  ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పార్టీ హైకమాండ్ నిరంతరం మనతోనే ఉన్నదని వారికి భరోసా ఇచ్చారు.

click me!