
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ కోడ్ ఉల్లంఘిస్తోందంటూ టీఆర్ఎస్ ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలను అందించారు.
నియోజకవర్గంలో ఫంక్షన్ హాళ్లను బీజేపీ వాడుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. అలాగే నియోజకవర్గంలో పార్టీ జెండాలు, బ్యానర్ల పేరుతో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంచుతున్నారని బీజేపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు.
కాగా ఏ ముఖం పెట్టుకొని దుబ్బాకలో టీఆర్ఎస్ నేతలు ఓట్లు అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.
మోడీ, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగియని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దేశంలో, రాష్ట్రంలో రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన మోడీ, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు.
రెండు మూడు రోజుల్లో దుబ్బాకలో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. మోడీ నిర్ణయాలతో అంబానీ, అదానీ, అమెజాన్ లకే లాభమని ఆయన అన్నారు.