కరోనా తెచ్చిన కష్టాలు.. నరకం చూస్తున్న మహిళలు

By telugu news teamFirst Published Jul 23, 2020, 12:00 PM IST
Highlights

మద్యం, ఉద్యోగ భద్రత, జీతాల్లో కోత, వ్యాపారాల్లో నష్టం, తదితర కారణాలు తోడై చివరకు అసహనాన్ని భార్యలపై చూపుతున్నారు. ఇంట్లో   24 గంటలు భర్తలతో కలిసి ఉండటంతో గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. 

కరోనా వైరస్ దేశంలో ఎంతలా విలయతాండవం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు నమోదౌతున్నాయి. ఇదంతా ఒకటైతే.. ఈ వైరస్ కారణంగా ఇంట్లోనే చాలా మంది మహిళలు నరకం అనుభవిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా తమ ఇళ్లల్లో గృహ హింస పెరిగిపోయిందని మహిళలు వాపోతుండటం గమనార్హం.

కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో మద్యం, ఉద్యోగ భద్రత, జీతాల్లో కోత, వ్యాపారాల్లో నష్టం, తదితర కారణాలు తోడై చివరకు అసహనాన్ని భార్యలపై చూపుతున్నారు. ఇంట్లో   24 గంటలు భర్తలతో కలిసి ఉండటంతో గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలోనూ కుప్పలుకుప్పలుగా గృహ హింస కేసులు పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు. ఇక కేవలం గత ఐదు నెలల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 515 గృహహింస కేసులు నమోద య్యాయి. అందులో అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 327 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 162, వికారాబాద్‌లో 26 కేసులు నమోదయ్యాయి.

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ విధించాయి. 23 నుంచి 31 వరకు కేవలం తొమ్మిది రోజుల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 101 గృహహింస కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 77 కేసులు మేడ్చల్‌ జిల్లాలోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 24 కేసులు నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లాలో ఒక్కటి కూడా నమోదు కాలేదు. 

ఏప్రిల్‌ నెలలో గృహహింస కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో కలిపి 56 కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికంగా 44 కేసులు మేడ్చల్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలో తొమ్మిది కేసులు నమోదు కాగా వికారాబాద్‌లో కేవ లం మూడు కేసులే నమోదయ్యాయి. మే నెలలో మళ్లీ కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. మొత్తం 142 కేసులు నమోదు కాగా, అందులో 85 కేసులు మేడ్చల్‌ జిల్లాకు సంబంధించినవే ఉన్నాయి. రంగా రెడ్డిలో 48 కేసులు నమోదు కాగా వికారాబాద్‌లో తొమ్మిది నమోదయ్యాయి. కేవలం జూన్ నెలలోనే 150కి పైగా  కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.

click me!