
సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కుటుంబ సభ్యులు శనివారం వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ను కలిశారు. ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ సీపీతో భేటీ అయ్యారు. అనంతరం నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి ఆత్మహత్యేగానే నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరికొందరి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చుతామని సీపీ హామీ ఇచ్చారని నరేందర్ అన్నారు.
పోలీసులు నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నారని.. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడంపై తమకు కొన్ని అనుమానాలు వున్నాయని ఆయన చెప్పారు. అయితే సీపీ రంగనాథ్ కొన్ని ఆధారాలను చూపించి సందేహాలను నివృత్తి చేశారని నరేందర్ పేర్కొన్నారు. ప్రీతి విషయంలో కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్వోడీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సైఫే వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నరేందర్ అన్నారు. ఈ కేసులో దోషులకు శిక్షపడేలా చేసి న్యాయం చేస్తామని సీపీ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
Also Read: డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే.. ఆ ఇంజెక్షన్ తీసుకుని : వరంగల్ సీపీ సంచలన ప్రకటన
ఇకపోతే.. డాక్టర్ ప్రీతి మృతిపై వరంగల్ సీపీ రంగనాథ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యేనని ఆయన వెల్లడించారు. పాయిజిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ప్రీతి మరణించినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఈ విషయం తెలిపిందన్నారు. అయితే ప్రతి ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫేనని రంగనాథ్ ప్రకటించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు. పదిరోజుల్లో ప్రీతి కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.
కాగా.. కేఎంసీలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ప్రీతి ఆత్మహత్యా కాదని.. హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.