నా చేతిలో 6 నెలలే ఉన్నాయ్, నా క్యాన్సర్ గురించి అమ్మనాన్నకు చెప్పొద్దు: హైదరాాబాద్ వైద్యుడితో పిల్లాడు

By Mahesh KFirst Published Jan 7, 2023, 7:16 PM IST
Highlights

హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్ సుధీర్ కుమార్‌ ఓ ఆరేళ్ల పిల్లాడి గురించిన చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ పిల్లాడికి సత్యం చెప్పకూడదని తల్లిదండ్రులు వైద్యుడికి కోరారు. తనకు క్యాన్సర్ ఉన్నదని, మరో ఆరు నెలలు మాత్రమే జీవిస్తానని తనకు తెలుసు అని, ఈ విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పొద్దని పిల్లాడు వైద్యుడితో అన్నాడు. ఇప్పుడా పిల్లాడు లేడు. ఈ ఘటన మొత్తం మనసు మెలిపెడుతున్నది. 
 

హైదరాబాద్: ‘డాక్టర్ గారూ.. నా చేతిలో కేవలం ఆరు  నెలలే ఉన్నాయి. నా క్యాన్సర్ గురించి మా అమ్మా నాన్నకు చెప్పొద్దు’ ఒక ఆరేళ్ల పిల్లాడు వైద్యుడితో అన్న మాటలివి. తల్లిదండ్రుల పై ప్రేమ క్యాన్సర్ భయాన్ని గెలిచేలా చేసింది. కానీ, ఆ పిల్లాడు ఇప్పుడు మరణించాడు. అతని మరణం తర్వాత ఆ వైద్యుడు ఆ వివరాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అయింది.

చాలా తక్కువ కాలమే బతికిని మను (పేరు మార్చారు) ఎన్నో ఏళ్ల అనుభవజ్ఞుడికి ఉండే మనో నిగ్రహాన్ని ప్రదర్శించాడు. ఆయన మాటలతో నిర్ఘాంతపోయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ నెల 5వ తేదీన హృదయాన్ని ద్రవీకరించే ఆ ఎపిసోడ్‌ను ట్విట్టర్‌లో వివరించారు. డాక్టర్ సుధీర్ కుమార్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

డాక్టర్ సుధీర్ కుమార్‌కు ఎప్పటిలాగే అది కూడా ఒక బిజీ ఓపీడీ రోజు. ఆ సమయంలో ఇద్దరు యువ దంపతులు తన వద్దకు వచ్చారు. ‘మను బయట వెయిట్ చేస్తున్నాడు. అతనికి క్యాన్సర్ ఉన్నది. కానీ, ఆ విషయాన్ని మనుతో చెప్పలేదు. దయచేసి మనును పరీక్షించి ట్రీట్‌మెంట్‌ను అడ్వైజ్ చేయండి. ఆ వివరాలు మనుకు తెలియనీయకండి’ అని వారు డాక్టర్‌తో చెప్పారు. మనును వీల్ చైర్‌లో అక్కడకు తీసుకువచ్చారు.

Also Read: ఆర్టీసీ బస్సు కోసం మంత్రి పరుగులు.. ఏంటి మ్యాటర్..?

వీల్ చైర్‌లో వచ్చిన మను ముఖంలో నవ్వు ఉన్నదని, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, స్మార్ట్‌గా కూడా కనిపించాడని డాక్టర్ సుధీర్ కుమార్ జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

మనకు ఎడమ వైపు మెదడులో గ్లయోబ్లాస్టొమా మల్టీఫోమ్ గ్రేడ్ 4 అని తేలింది. అందువల్లే మను కుడి చేయి, కాలు పని చేయకుండా ఉన్నాయి. అతనికి కీమోథెరపీ కూడా చేశారు. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా అప్పుడప్పుడు మను మూర్ఛపోతున్నాడు కూడా.

‘వారు ఇక వెళ్లిపోతున్నప్పుడు, నాతో ప్రైవేట్‌గా మాట్లాడటానికి అనుమతించాలని వారి తల్లిదండ్రులను కోరాడు’ అని డాక్టర్ పేర్కొన్నారు. ‘డాక్టర్, ఈ డిసీజ్ గురించి ఐపాడ్‌లో నేను మొత్తం చదివేశా.. నేను మరో ఆరు నెలలు మాత్రమే బతుకుతా అని కూడా నాకు తెలుసు. కానీ, ఈ విషయాన్ని నేను నా తల్లిదండ్రులతో పంచుకోలేదు. ఎందుకంటే వారు అప్‌సెట్ అవుతారు. వారు నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని నా పేరెంట్స్‌కు చెప్పొద్దు’ అని మను తనతో చెప్పినట్టు డాక్టర్ పేర్కొన్నాడు.

6-yr old to me: "Doctor, I have grade 4 cancer and will live only for 6 more months, don't tell my parents about this"
1. It was another busy OPD, when a young couple walked in. They had a request "Manu is waiting outside. He has cancer, but we haven't disclosed that to him+

— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor)

ఆరు సంవత్సరాల బుడతడి నోటి నుంచి ఈ మాటలు విని డాక్టర్ నిర్ఘాంతపోయారు. ‘నన్ను నేను కూడగట్టుకుని.. ఓహ్ తప్పకుండా, నువ్వు చెప్పినదాని గురించి నాకు వదిలిపెట్టు.. నేను చూసుకుంటాను’ అని మనుకు చెప్పాను. ఆ వెంటనే ‘నేను నా మను పేరెంట్స్‌ను రమ్మన్నాను. మనును బయట వెయిట్ చేయించి నాతో మాట్లాడాలని కోరాను. నాతో మను పూర్తి సంభాషణను వారికి తెలియజేశాను’ అని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.

తాను మనుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానని ఆ డాక్టర్ చింతించారు. కానీ, ఇలాంటి సున్నితమైన విషయాల్లో కుటుంబాన్ని అంతా ఒక చోట చేర్చడం ముఖ్యం  అని వివరించారు.

తొమ్మిది నెలల తర్వాత ఆ దంపతులు మళ్లీ నా వద్దకు వచ్చారు. వారిని చూడ గానే డాక్టర్ గుర్తు పట్టారు. మను ఆరోగ్యం గురించి వాకబు చేశారు. దంపతులు ఇలా చెప్పారు.. ‘డాక్టర్, మేం మిమ్మల్ని కలిసిన తర్వాత మనుతో గొప్ప సమయం గడిపాం. మను డిస్నీల్యాండ్ సందర్శించాలని అనుకున్నాడు. మేం అతన్ని తీసుకుని వెళ్లాం. ఒక నెల కిందటే మనును మేం కోల్పోయాం. మాకు అద్భుతమైన ఎనిమిది నెలలు అందించినందుకు థాంక్స్ చెప్పడానికి ఈ రోజు మీ దగ్గరకు వచ్చాం’ అని ఆ దంపతులు తెలిపారని వైద్యులు ట్వీట్ చేశారు.

click me!