అమృతను చాలా గారాబంగా పెంచారు.. డాక్టర్ జ్యోతి

By ramya neerukondaFirst Published Sep 18, 2018, 12:01 PM IST
Highlights

వారి కుటుంబంతో పరిచయం వల్లే మొదట తనను కలవడానికి భయపడినట్టు ఆమె తెలిపారు. తల్లిదండ్రులు సపోర్ట్ లేని కారణంగా తాను ఆమెతో ఎక్కువ సేపు గడిపి, జాగ్రత్తలు చెబుతూ ఉండేదాన్నని, ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చానని అన్నారు. 

మారుతీరావుకి కూతురు అమృత వర్షిణి అంటే చాలా ప్రేమ అని వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ జ్యోతి తెలిపారు. తక్కువ కులస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయాలపై వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ జ్యోతితో  ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మారుతీరావు దంపతులకు వివాహమైన చాలా ఏళ్ల తర్వాత అమృత జన్మించిందని, తన హాస్పిటల్‌లోనే పురుడు పోసినట్టు ఆమె తెలియజేశారు. అదే హాస్పటల్ ఆవరణలో ప్రణయ్ హత్యకు గురవ్వడం గమనార్హం. 

లేకలేక పుట్టిన అమృతను వారు ఎంతో అపురూపంగా చూసుకున్న విషయం తనకు బాగా తెలుసునని డాక్టర్ జ్యోతి పేర్కొన్నారు. రెగ్యులర్ చెకప్‌కి అమృత తల్లి తన దగ్గరకే వచ్చేదని దాదాపు పాతికేళ్ల నాటి సంగతులను ఆమె గుర్తు చేసుకున్నారు. అమృత పుట్టినప్పుడు డెలివరీ క్లిష్టమైందని తెలిపారు. ఆ కుటుంబానికి చెందిన పిల్లలు తన హాస్పిటల్‌లోనే పుట్టారని చెప్పారు. దీంతో ఆ కుటుంబంతో తనకు అనుబంధం ఏర్పడిందని, వారి ఇంట్లో జరిగే వేడుకలు, శుభకార్యాలకు ఆహ్వానించేవారని తెలిపింది. 

అమృతతో తనకు మంచి పరిచయం ఉందని, అత్తా అని పిలిచేదని డాక్టర్ జ్యోతి వెల్లడించారు. అమృతకు వివాహం గురించి తనకు సామాజిక మాధ్యమాల ద్వారానే తెలిసిందని, గర్భం దాల్చిన తరువాత భయపడుతూనే సంప్రదించిందని అన్నారు. వారి కుటుంబంతో పరిచయం వల్లే మొదట తనను కలవడానికి భయపడినట్టు ఆమె తెలిపారు. తల్లిదండ్రులు సపోర్ట్ లేని కారణంగా తాను ఆమెతో ఎక్కువ సేపు గడిపి, జాగ్రత్తలు చెబుతూ ఉండేదాన్నని, ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చానని అన్నారు. 

తన ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. తన కళ్ల ముందే ప్రణయ్ కొన ఊపిరి పోవడంతో తాను కోలుకోవడానికి చాలాసేపు పట్టిందని డాక్టర్ జ్యోతి తెలిపారు. ఉద్వేగాలను అదుపు చేయలేకపోయానని అన్నారు. ప్రణయ్‌ను పొడిచేశారంటూ ముందుగా అమృత నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి చెప్పిందని, తాను వెళ్లేసరికి అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని చెప్పారు. 

click me!