
ఖమ్మం :ఇటీవల చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అప్పటివరకు పూర్తి ఆరోగ్యంగా వున్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం వెలుగుచూసాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు కూడా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన నాగుల్ మీరా - మైబూబీ దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. భర్త కార్పెంటర్ గా, భార్య దినసరి కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. అయితే ఉన్నత చదువుల కోసమని వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More 13యేళ్ల బాలికకు గుండెపోటు.. నిద్రలో ఆయాసపడుతూ లేచి.. అంతలోనే...
నాగుల్ మీరా - మైబూబీ దంపతుల కొడుకు షేక్ ఖాసీం పాషా(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదివేవాడు. ఖమ్మం పట్టణంలో బంధువుల ఇంట్లో వుంటూ ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో చదువుకునేవాడు. అయితే గత మంగళవారం రాత్రి ఖాసీం ఇంట్లో వుండగా ఒక్కసారిగా విపరీతమైన చాతినొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. అతడికి గుండెపోటు వచ్చినట్లు తెలిపారు.
ఖాసీం మృతితో స్వగ్రామం రేపల్లెవాడలో తీవ్ర విషాదం నెలకొంది. కడుపుకోతతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోంది.