కార్పోరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం... కరోనా మృతదేహాలు తారుమారు

By Arun Kumar PFirst Published Sep 27, 2020, 9:00 AM IST
Highlights

కరోనా సోకడంతో ఒల్లు గుల్లవుతున్న రోగుల నుండి చికిత్స కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని కూడా గుల్ల చేస్తున్నాయి కార్పోరేట్ హాస్పిటల్స్.

నిజామాబాద్: కరోనా సోకడంతో ఒల్లు గుల్లవుతున్న రోగుల నుండి చికిత్స కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని కూడా గుల్ల చేస్తున్నాయి కార్పోరేట్ హాస్పిటల్స్. ఇలా చికిత్స పేరిట లక్షల్లో వసూలు చేస్తూకూడా కరోనా రోగులపట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా కార్పోరేట్ నిర్లక్ష్యానికి మరోసారి బట్టబయలు చేసే సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెంది అంకం హనుమంతు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో చేర్చారు. దాదాపు 11రోజులు హాస్పిటల్లో చికిత్స పొందినా అతడి ఆరోగ్యం మెరుగుపడక తాజాగా మృత్యువాతపడ్డాడు. 

ఈ క్రమంలో సదరు హాస్పిటల్ వైద్యానికైన రూ.10లక్షల పైచిలుకు ఫీజును చెల్లించేంతవరకు మృతదేహాన్ని అప్పగించలేదు. అయితే హనుమంతు మృతదేహానికి బదులు వేరే వ్యక్తి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహం మొత్తం ప్యాక్ చేసి వుండటంతో కుటుంబసభ్యులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. 

అయితే అంబులెన్స్ లోని మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేయడానికి ముందు చివరిచూపు చూసేందుకు ముఖాన్ని తెరిచారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇలా హాస్పటల్ నిర్లక్ష్యం కారణంగా అసలే బాధలో వున్న కుటుంబం మరింత బాధపడాల్సి వచ్చింది. దీంతో సదరు హాస్పిటల్ పై బాధిత కుటుంబమే కాదు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.  

click me!