
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి టూరిస్టుల్లా వచ్చి.. నోటికి ఏది వస్తే.. అది మాట్లాడి వెళ్లిపోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే దళితబంధును దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని సవాల్ విసిరారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్లో రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే.. రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయనకు విషయాల పట్ల కనీస అవగాహన లేదని, తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ఏద్దేవా చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం మోడీ ఎన్నికలప్పుడు వచ్చి.. పాలమూరు-రంగారెడ్డి పథకంపై ఏమి హామీ ఇచ్చారో.. కేంద్రమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే మహబూబ్ నగర్ జిల్లా దశ మారిందని అన్నారు. మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీ కేసీఆర్ ఇచ్చారా? మోడీ ఇచ్చారా?అని ప్రశ్నించారు. పాలమూరులో వలసలను కేసీఆర్ ఆపారా? మోడీ ఆపారా? అని నిలదీశారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి కేవలం టూరిస్టుల్లా వచ్చి ఏదేదో మాట్లాడి పోతున్నారనీ, కేంద్ర మంత్రిగా ఉన్న పాండే కు విషయాల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు. పాలమూరు జిల్లాకు పది లక్షల ఎకరాలకు నీరు పారించింది కేసీఆర్ అని అన్నారు.
బీజేపీ నేతల పిచ్చి మాటలు నమెందుకు తెలంగాణ ప్రజలు పిచ్చోల్లు కాదనీ, భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నపార్టీ బీజేపీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ఆటలు ఎక్కడైనా సాగొచ్చు.. తెలంగాణలో సాగవని అన్నారు. బీజేపీ ప్రశ్నించే గొంతుకలను నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందనీ, తెలంగాణలో ఏ పథకం చూసినా.. ఓ రికార్డేననీ, కేంద్రంలో ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేది ఉందా అని అన్నారు. దళితబంధుయే రాబోయే రోజుల్లో బీసీబంధు, గిరిజనబంధు కూడా వస్తాయని అన్నారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్ పుట్టలేదనీ, ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. తెలంగాణ కన్నాఅద్భుతమైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? ఢిల్లీ వేదిగ్గా చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రజల గొంతు నొక్కడమేననీ, బీజేపీకి దమ్ముంటే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆపాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ను దమ్ముంటే బీజేపీ ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ.. రిజర్వేషన్లను ఎత్తి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలనేదే బీజేపీ తపన అనీ, ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్నదే బీజేపీ ఆలోచన అని అన్నారు. మొత్తం దేశంలో తామే ఉండాలనేది బీజేపీ ఆలోచనననీ. దీనికి ప్రజలు తిరుగు బాటు చేస్తారని, ఆ ప్రకృతి కూడా సహకరించదని విమర్శించారు.
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణ పై తోడేళ్ల గుంపులా దాడి చేస్తున్నారనీ, పచ్చ బడ్డ తెలంగాణలో రక్తం పారించాలనేదే బీజేపీ ఆలోచనననీ అన్నారు. దేశానికి బీసీ ప్రధాని ఉన్నా.. బీసీలకు ఏమీ చేయడం లేదనీ, బీజేపీకి దమ్ముంటే దళితబంధును దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని సవాలు విసిరారు. బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసి వెళ్లినంత మాత్రాన ఒరిగేదేమీ లేదనీ, తెలంగాణ నుంచి కేంద్రం తీసుకోవడమే తప్ప ఇస్తున్నది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడటం లేదనీ, అబద్దాలు మాట్లాడటం తప్ప.. బీజేపీ నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఏమి తెస్తారో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు ఏమి చేశారో తెలుసుకోవాలంటే.. బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడటం మానాలని సూచించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తోందనీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ నేతలకు కనిపించడం లేదని విమర్శించారు. సాగు చట్టాలపై మోడీ రైతులకు క్షమాపణ చెప్పారనీ, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. మరోవైపు.. గణేష్ విగ్రహాలపై బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు మించిన హిందువు మరెవ్వరైనా ఉన్నారా? నిలదీశారు. బీజేపీ నేతలు తామే హిందువులు మిగతా వారు కారు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లా అని అన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయాలు నడవవని అన్నారు.