మునుగోడులో టీఆర్ఎస్‌ను గెలిపించి మోడీకి బుద్ది చెప్పాలి: చండూరులో సభలో సీపీఐ నేత కూనంనేని

By narsimha lodeFirst Published Oct 30, 2022, 3:57 PM IST
Highlights

మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించి బీజేపీకి బుద్ది  చెప్పాలని  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని  సాంబశివరావు  కోరారు. చండూరులో నిర్వహించిన టీఆర్ఎస్ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.
 


చండూరు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి మోడీ, అమిత్ షాలకు బుద్ది చెప్పాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను  పురస్కరించుకొని చండూరులో ఆదివారం నాడు  నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని  సాంబశివరావు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి సీపీఐ,సీపీఎంలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మునుగోడు అంటే కమ్యూనిష్టుల అడ్డా అని ఆయన  చెప్పారు. తెలంగాణ  సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలతో నల్గొండ ఎరుపెక్కిందని ఆయన గత చరిత్రను గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ కమ్యూనిష్టులు కలిసిన తర్వాత మునుగోడు గడ్డపై మరో పార్టీకి చోటు ఉండదని  ఆయన తేల్చి చెప్పారు.స్వామిజీలకు పాంహౌస్ లో ఏం పని అని  ఆయన ప్రశ్నించారు.కమ్యూనిష్టుల గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్  రెడ్డికి లేదన్నారు. రాజగోపాల్  రెడ్డి మాదిరిగా  తాము పార్టీని  వదిలిపెట్టి పారిపోలేదని కూనంనేని విమర్శించారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తామని ఆయన హెచ్చరించారు. ఆత్మ,గౌరవం లేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అలాంటి రాజగోపాల్  రెడ్డికి ఆత్మగౌరవ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా  మారారని ఆయన  విమర్శించారు.

రాజగోపాల్ రెడ్డిని నమ్మి 2018లో ఈ  స్థానంలో  ప్రజలు గెలిపిస్తే ,ఇప్పుడు ఆ  ప్రజలను రాజగోపాల్ రెడ్ది మోసం  చేశారని ఆయన విమర్శించారు.డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి  యాదాద్రి ఆలయంలో  పూజలు చేస్తారా అని ఆయన బండి సంజయ్ ని విమర్శించారు.దొంగ  ప్రమాణాలు చేస్తే పేగులు తీసి యాదాద్రి  నరసింహస్వామి మెడలో వేసుకొంటాడని బండి సంజయ్ ను హెచ్చరించారు కూనంనేని సాంబశివరావు. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టలేదని మోడీ, అమిత్ షాతో ప్రమాణం చేయించాలని ఆయన బీజేపీకి  సవాల్ విసిరారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ధర్మం అని చెబితే ఆ పదమే సిగ్గు పడుతుందన్నారు.తెలంగాణనుండే మోడీ, అమిత్ షాకు బుద్ది చెప్పాలన్నారు. 
 

click me!