కామారెడ్డిలో కలకలం... ఆర్మీ జవాన్ కు కరోనా లక్షణాలు

By Arun Kumar PFirst Published Mar 19, 2020, 3:46 PM IST
Highlights

కామారెడ్డి జిల్లాలోనూ తాజాగా కరోనా కలకలం మొదలయ్యింది. ఓ ఆర్మీ జవాన్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో జిల్లాలో ఆందోళన మొదలయ్యింది. 

హైదరాబాద్: ఓ ఆర్మీ జవాన్ కరోనా లక్షణాలతో బాధపడుతున్న విషయం తాజాగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ లో ఇండోనేషియాకు చెందిన కొందరికి కరోనా వైరస్ సోకినట్లు బయటడిన విషయం తెలిసిందే. అయితే  వారు ప్రయాణించిన రైలులోనే సదరు జవాన్ కూడా డిల్లీనుండి వచ్చారు. దీంతో అతడికి వైద్యశాఖ శాఖ అధికారులు హైదరాబాద్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

జవాన్ ను చెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడికి జలుబు, దగ్గు, తలనొప్పి వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి నుండి శాంపిల్స్ స్వీకరించి పరీక్షల నిమిత్తం పంపించామని... రిపోర్ట్ వస్తేగానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. అప్పటివరకు అతన్ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులోనే వుంటారన్నారు.  

మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి రైల్లోనే ఆర్మీ జవాన్ వచ్చారు. ఇతడు వచ్చిన రైల్లో ప్రయాణించిన 8మంది విదేశీయులకు కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో జవాన్ కు వైరస్ సోకి వుంటుందని భావిస్తున్నారు.

read more  వెంటాడుతున్న కరోనా భయం.. అమ్మో వాళ్ల బట్టలు ఉతికేది లేదంటున్న ధోబీలు

తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దాకా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక్క కేసు కనపడింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. బుధవారం రాత్రి ఒకేసారి ఏడు కరోనా  కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వార్తలు వింటుంటే.. బటయకు అడుగుపెట్టాలన్నా కూడా వణికిపోతున్నారు.

కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియా నుంచి కరీంనగర్ కి వచ్చారు.  మొత్తం 10మంది ఇండోనేషియా నుంచి రాగా.. వారిలో ఏడుగురికి కరోనా లక్షణాలు గుర్తించారు.దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం  గాంధీకి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 

దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయమే యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఒకేసారి కరోనా కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాని కట్టడి చేసేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతున్నందువల్ల వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలనీ ఆదేశించారు.  ప్రజలు స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు రద్దు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని కోరారు.

click me!