తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా వాణీలు మంచి ఉత్తీర్ణత సాధించారు. వీరిలో వీణాకు 712 మార్కులు, వాణీ 707 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిద్దరికి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలియజేశారు.
మంగళవారం విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో (telangana inter results) అవిభక్త కవలలైన వీణా వాణీలు (Conjoined twins Vani and Veena) మంచి ఉత్తీర్ణత కనబరిచారు. వీణా 712 మార్కులు, వాణీ 707 మార్కులతో ఫస్ట్ క్లాస్ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ వీణా, వాణీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి భవిష్యత్కు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు, వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
కాగా.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003వ సంవత్సరంలో తలలు అతుక్కుని వీణా-వాణీ అనే ఇద్దరు కవలలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వరకు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో వారిద్దరూ గడిపారు. అనంతరం 12 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్ హోమ్లో గడుపుతున్నారు. వీరిని విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలంకాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణా-వాణీలకు ఇంటర్ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణా వాణీలు చార్టెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.