కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన మల్లు రవి

By narsimha lodeFirst Published Jan 18, 2023, 12:21 PM IST
Highlights

jకాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత  మల్లు రవి  బుధవారంనాడు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.  కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవిని  విచారించనున్నారు. 

హైదరాబాద్; కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి  బుధవారం నాడు  సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  తమ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ నేత మల్లు రవికి  పోలీసులు ఇదివరకే  నోటీసులు జారీ చేశారు.  ఈ నెల  12వ తేదీన విచారణకు రావాలని  మల్లు రవిని ఆ నోటీసులో  పోలీసులు కోరారు. అయితే  ఈ నెల  12 వ తేదీన విచారణకు రావడం సాధ్యం కాదని  మరో రోజు సమయం ఇస్తే  తాను విచారణకు వస్తానని మల్లు రవి  సీసీఎస్ పోలీసులకు సమాచారం పంపారు. ఈ సమాచారం ఆధారంగా  ఇవాళ  విచారణకు రావాలని  మల్లు రవిని పోలీసులు కోరారు. దీంతో  మల్లు రవి ఇవాళ సీసీఎస్  పోలీసుల విచారణకు  హాజరయ్యారు. 

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  ఈ నెల 9వ తేదీన  మల్లు రవికి  సీసీఎస్ పోలీసులు  నోటీసులు జారీ చేశారు.  కాంగ్రెస్ వార్ రూమ్‌తో తనకు సంబంధం లేదని  కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు  పోలీసులకు స్పష్టం చేశారు.   కాంగ్రెస్ వార్ రూమ్ కి తాను ఇంచార్జీగా  ఉన్నట్టుగా మల్లు రవి  ప్రకటించారు.ఈ విషయమై  ఆయన పోలీసులకు లేఖ రాశాడు.  ఈ లేఖ ఆధారంగా మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు  41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు.

also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: సీసీఎస్ పోలీసులతో మల్లు రవి భేటీ

2022 డిసెంబర్  13వ తేదీన హైద్రాబాద్ మాదాపూర్ లో గల   కాంగ్రెస్ వార్ రూమ్ లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మహిళలను కించపర్చేలా  సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని  అందిన ఫిర్యాదుల ఆధారంగా  పోలీసులు సోదాలు చేశారు.  కాంగ్రెస్ వార్ రూమ్ లో  సునీల్ కనుగోలుకు చెందిన సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సునీల్ కనుగోలు సహా ఆయన సిబ్బందికి  సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులపై  స్టే కోరుతూ  సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ పై  స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ నెల  9వ తేదీన  సునీల్ కనుగోలు  సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.  మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని కూడా  సునీల్ కనుగోలును సీసీఎస్ పోలీసులు ఆదేశించారు.

click me!