
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారంనాడు ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మారే విషయమై ఆయన ఈ సమావేశంలో ప్రకటిస్తారని అనుకున్నారు.
అయితే, నియోజకవర్గం సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కానీ, అనారోగ్యం కారణంగా చండూరులో ఏర్పాటు చేసిన ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి ముఖ్య నాయకులతో కలిసి రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లు చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారంటూ గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ను ఓడించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ను ఓడించే పార్టీలో ఉంటానని ఆయన చెప్పారు. దీంతో ఆయన బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
అమిత్ షాతో కలిసి మాట్లాడిన విషయం నిజమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ మార్పుపై గతంతో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ ను ఓడించడమై లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన కూడా అసంత్రుప్తితో ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవిని ఆశించారు కూడా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు తీవ్రమైన నష్టమే జరుగుతుంది.
తెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించేందకు ప్రత్యేక ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందకు చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఈటెల రాజేందర్ నాయకత్వం వహిస్తున్నారు. జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక వ్యూహాలు రచించి అమలు చేయిస్తోంది.