కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో సంగారెడ్డిలోని పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్టుగా చెప్పారు. క్యాడర్ పోటీకి ముందుకు రాకుంటే.. తన భార్య నిర్మలను బరిలో నిలుపుతానని తెలిపారు. తాను మళ్లీ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. రాజకీయ వ్యుహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని తెలిపారు. తాను ఒక టర్మ్ ఎందుకు దూరంగా ఉంటున్నానో తర్వాత తెలుస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావంగా సంగారెడ్డి నియోజకర్గంలో తాను రేపటి నుంచి పాదయాత్ర చేయనున్నట్టుగా జగ్గారెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలు వినే పరస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఆరు నెలల తర్వాత మూడు రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పైరవీలు చేసుకుని బతుకుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లేరని అన్నారు.