
ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేశారు. కేసీఆర్ అవినీతికి మోడీ ఆశీస్సులు వున్నాయని.. ఆయన స్కాంల గురించి మోడీ దర్యాప్తు సంస్థలకు తెలుసునంటూ రాహుల్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్గా పోల్చిన ఆయన... బీఆర్ఎస్ అంటే ‘‘ బీజేపీ రిష్తెదార్ సమితి’’ అని అభివర్ణించారు. కేసీఆర్ స్కాంలు మోడీకి తెలిసినా ఆయన చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందన్నారు.
తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందన్న రాహుల్.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అడ్రస్ లేదన్నారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారని.. పార్లమెంట్లో బీజేపీకి అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా నిలిచిందని రాహుల్ దుయ్యబట్టారు. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతిచ్చిందని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లే తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి ఒప్పందం లేదని.. ఇటీవల జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ వస్తే మేం రాం అని చెప్పామని ఆయన గుర్తుచేశారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డ్.. వారికి నెల నెలా రూ.4000 : ఖమ్మంలో రాహుల్ గాంధీ ప్రకటన
కేసీఆర్ తెలంగాణకు రాజులా భావిస్తాడని, రాష్ట్రాన్ని జాగీరులా ఫీలవుతాడని రాహుల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరుపేదలకు, గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ భూములు కేసీఆర్వి కావని మీవని రాహుల్ చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరాకాష్టకు చేరిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ విషయం భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన దృష్టికి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. ధరణి ద్వారా ముఖ్యమంత్రి భూములను , మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులు, దళితులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల నుంచి కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కర్ణాటకలోనూ అవినీతి ప్రభుత్వం వుందని.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలబడి వుందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతుందని రాహుల్ జోస్యం చెప్పారు. ఇక్కడ ఓ వైపు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన మిత్రులు వున్నారని.. మరోవైపు రైతులు, దళితులు, ఆదివాసీలు వున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందని.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్యే పోటీ అన్నారు. ఇటీవల పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం జరిగిందని.. దీనికి బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించామన్నారు. కానీ కేసీఆర్ మనుషులు ఎవరూ రాలేదని.. దీనిని బట్టి బీజేపీకి బీఆర్ఎస్ అని తేలిందని రాహుల్ ఎద్దేవా చేశారు.