నిద్రిస్తున్న పులిని లేపి తప్పు చేసావ్.. ఇక కాస్కో..: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 23, 2022, 12:36 PM IST
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నాడని సురేఖ విరుచుకుపడ్డారు. 

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో (warangal district) టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress Party) శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి (konda murali) తల్లిదండ్రులు సమాధులను కొందరు ధ్వంసం చేయడానికి యత్నించడమే ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమాధుల ధ్వంసానికి పాల్పడుతుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ (konda surekha) సీరియస్ అయ్యారు. తన అత్తా మామ సమాధులను పరకాల (parakala) ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (challa dharmareddy) ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసారని ఆరోపించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యేను తీవ్రంగా హెచ్చరించారు.

''అరేయ్ ధర్మారెడ్డి... ఒక తల్లీ తండ్రికి పుట్టి ఉంటే ఇలాంటి పనులు చేసేవాడివి కాదు. నిద్రిస్తున్న పులిని తట్టి లేపావు.  ఇక కాస్కో. ఏం చేస్తావో చేసుకో. కానీ నీ పాపం పండింది. ప్రజలు తిరగబడి తరమికొట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి'' అంటూ మాజీ మంత్రి సురేఖ హెచ్చరించారు. 

''గతంలో మూడు కోట్ల కాంట్రాక్ట్ కోసం మా వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్న సంగతి మరిచావా?  గర్తుపెట్టుకో... కొండాను డీ కొట్టడమంటే కొండను ఢీకొట్టినట్లే. మేం ఇక్కడ లేకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావని గుర్తుంచుకో'' అంటూ సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అగ్రంపహాడ్ వద్ద తమ అత్తామామల సమాధుల వద్ద మూడెకరాల భూమిని కొనుగోలు చేసినట్లు... ఇప్పటికీ ఆ భూమి తమ బిడ్డ సుస్మితా పటేల్ పేరుపైనే వుందని కొండా సురేఖ వెల్లడించారు. అత్తామామల స్మారకార్థం ప్రజలకు ఉపయోగకరంగా ఆ స్థలాన్ని మార్చామని... అక్కడే  సమ్మక్క-సారలమ్మ గద్దెలను నిర్మించారని తెలిపారు. ఆ భూమిని దేవాదాయ శాఖకు తాము అప్పగించలేదని... అలాంటిది అక్కడ తమ అత్తామామల సమాధులను ఎలా తొలగిస్తారని కొండా సురేఖ నిలదీసారు. 

అసలేం జరిగిందంటే... 

హన్మంకొండ జిల్లా  ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలున్నారు. అయితే ఇక్కడ ప్రతి రెండేళ్ళకోసారి ఘనంగా జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జాతర జరగాల్సి వుండగా ఏర్పాట్లకోసం నూతన కార్యవర్గం ఏర్పాటుచేసారు. ఈ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెలను పరిశీలించారు. అయితే గద్దెల పక్కనే వున్న  కొండా మురళి తల్లిదండ్రుల సమాధులపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే  అక్కడినుండి వెళ్ళిపోయిన  కొద్దిసేపటికే కొందరు కొండా తల్లిదండ్రుల సమాధుల ధ్వంసానికి పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని దీన్ని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డితో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇక తమను ఎదుర్కోడానికి సిద్దంగా వుండాలంటూ సురేఖ హెచ్చరించారు.


 

click me!