
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. దీంతో ఇందుకు సంబంధించి టీపీసీసీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికపై కూడా దృష్టి సారించాల్సి రావడంతో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ పాదయాత్రకు సంబంధించి తెలంగాణ నాయకులకు పని విభజన చేసింది. మునుగోడు ఉప ఎన్నికను వదిలేసి.. కొందరు నాయకులు రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ పాదయాత్ర, మునుగోడు ఉప ఎన్నిక.. రెండు ముఖ్యమే అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
దీంతో పార్టీలోకి నాయకులకు రాహుల్ పాదయాత్ర, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి.. పని విభజన చేసినట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్కు రాహుల్ పాదయాత్ర బాధ్యతను అప్పగించారు. అయితే రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత రేవంత్ కూడా యాత్రలో పాల్గొనడంతో పాటు.. మునుగోడుపై కూడా దృష్టి సారించనున్నారు.