టీడీపీ మద్దతుతోనే బీఆర్ఎస్‌ను ఓడించాం: రేణుకా చౌదరి

By Mahesh KFirst Published Jan 18, 2024, 3:54 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ మద్దతుతో బీఆర్ఎస్‌ను ఇంటికి తరిమేశామని కామెంట్ చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు కేవలం తనకే ఉన్నదని వివరించారు.
 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాణించినా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాణిస్తున్నా.. అది దివంగత ఎన్టీఆర్ నేర్పిన స్కిల్ అని అన్నారు. అధికారంలో లేకున్నా.. తెలుగు దేశం పార్టీ బతికి ఉన్నదంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణే అని వివరించారు.

రాజకీయ నేపథ్యంలేని ఎందరో మందిని నాయకులుగా తీర్చి దిద్దిన ఘనత ఎన్టీ రామారావుదేనని రేణుకా చౌదరి అన్నారు. తనకు కూడా రాజకీయ నేపథ్యం లేకున్నా ఆయనే రాజకీయాల్లోకి తీసుకువచ్చారని వివరించారు. ఆ సమయాల్లో తనను టీడీపీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా అని ఎన్టీఆర్ అనేవారని పేర్కొన్నారు.

Latest Videos

తెలంగాణలో పదేళ్లపాట రాక్షస పాలన సాగిందని, టీడీపీ మద్దతుతోనే తాము బీఆర్ఎస్‌ను ఇంటికి తరిమేశామని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా తమకు సహకరించిందని వివరించారు.

Also Read : Viral: సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న యువకుడు కోచింగ్ క్లాస్‌లోనే హఠాన్మరణం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీనిపైనా నందిని స్పందిస్తూ.. అది ప్రజల ప్రచారమేనని, ఆ ప్రజల ప్రచారాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఏమో.. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చని వివరించారు.

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ భట్టి విక్రమార్క సతీమణికే దక్కుతుందా? ఆమెనే ఖమ్మం నుంచి పోటీ చేస్తారా? వంటి ప్రశ్నలకు రేణుకా చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం నుంచి పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు. తాను అడిగితే కాదనే శక్తి ఎవరికీ లేదు అన్నారు. ఇక్కడ హక్కు కేవలం తనకే ఉన్నదని, ఇది స్పష్టంగా చెబుతున్నానని వివరించారు. అయితే, సోనియా గాంధీ పోటీ చేయాలి.. లేదంటే తానే పోటీ చేయాలని స్పష్టం చేశారు.

click me!