
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటన వ్యవహారం గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓయూలో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్ఎస్యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేసింది. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది.
అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది.
ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారని వారు చెబతున్నారు.
అయితే ఓయూలో ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతివ్వాలని ఎన్ఎస్యూఐ నేతలు నిరసన చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీని ఓయూలో అడుగుపెట్టనివ్వమని చెబుతున్న టీఆర్ఎస్వీ నాయకులు.. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. దీంతో క్యాంపస్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.