
తెలంగాణలో ఇంటర్ ఫలితాల (telangana inter results 2022) ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఫలితాలు తక్కువగా వస్తే పరిస్ధితి ఏంటనే ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు వున్నారు. ఫస్టియర్ ఫలితాలు తక్కువ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సెకండియర్లో తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదైతే. మళ్లీ ఆందోళనలు జరుగుతాయేమోనన్న టెన్షన్లో ప్రభుత్వ పెద్దలు వున్నారు. గ్రేస్ మార్క్స్ ఇవ్వాలనే ఆలోచనలో వున్నా.. ఫలితాలకు ముందు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా అనే దానిపై తర్జన భర్జనలు పడుతోంది సర్కార్. దీంతో ఫలితాల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మంగళవారం తర్వాతే రిజల్ట్స్ వెల్లడయ్యే ఛాన్స్ వుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24వ తేదీన పూర్తయ్యాయి. ఆ సమయంలో 20 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. ఆ లెక్కన చూసుకుంటే జూన్ 15న ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ తేదీ మారుతూనే వచ్చింది. ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) జూన్ 25 నాటికి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఫలితాలు ఆలస్యమైనా పర్లేదు కానీ ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకూడదని తెలిపారని వార్తలు వచ్చాయి. దీంతో శనివారం ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ రిజల్ట్స్పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు జూన్ 27న (సోమవారం) ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.