సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ..

Published : Dec 18, 2023, 07:30 AM IST
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 17న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంఓ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేతలతో ఆయన చర్చించనున్నారు. 

రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే ముఖ్య నిర్ణయాల అమలు జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న (మంగళవారం) సీఎం రేవంత్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.

ఈ క్రమంలో పార్టీ పరంగా నియామకాలకు సంబంధించిన చర్చలు, ఆమోద ముద్ర వేసుకరానున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో మంత్రి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. అలాగే.. నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూడా హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ద్రుష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.  అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీ రానున్నది. 

ఇప్పటికే పార్టీ 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. మరో ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలోకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేర్లపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అయితే కేబినెట్‌ విస్తరణ ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు.కానీ.. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్‌ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.

హైదరాబాద్‌  నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలువనప్పటికీ.. నాంపల్లిలో ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్‌ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. ఇదే కోటాకు నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్‌అలీ కూడా పోటీ పడే అవకాశం లేకపోలేదు. మరోవైపు.. మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

అలాగే..అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం. ఆదిలాబాద్ నుంచి  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. వీరు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నట్టు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu