
హైదరాబాద్: కన్న తండ్రి, పిన తల్లి చేతిలో చిత్రహింసలకు గురయి దాదాపు చావు అంచులదాక వెళ్లిన ప్రత్యూష అనే యువతి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మామూలు మనిషిగా మారిన విషయం తెలిసిందే. యువతి కోలుకున్నాక ప్రగతిభవన్ కు పిలిపించుకుని తన కుటుంబంతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని కల్పించడమే కాదు ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు.
ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్న ప్రత్యూష ఇప్పుడు ఓ ఇంటిది కాబోతోంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ తన కాళ్లపై తాను నిలబడిన ఆమెను చేసుకోడానికి ఓ అబ్బాయి ముందుకువచ్చాడు.
ఇటీవల హైదరాబాద్ విద్యానగర్లోని ఓ హోటల్లో నిరాడంబరంగా చరణ్రెడ్డి అనే యువకుడితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. వివాహం రేపు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం మేరీమాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనుంది.
సీఎం ఆదేశాలతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు ప్రత్యూష యోగక్షేమాలను చూసుకుంటున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలోనే శనివారం బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గెస్ట్హౌజ్లోప్రత్యూషను పెళ్లికూతురును చేసే వేడుక నిర్వహించారు. అలాగే మెహందీ కార్యక్రమం కూడా చేపట్టారు.
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. ఇక పెళ్లికి కూడా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనే అవకాశాలున్నాయి.