ఈటలపై కేసీఆర్ కు ఎలాంటి కక్ష లేదు... అందుకు నిదర్శనమదే: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Jul 9, 2021, 5:15 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంటే ఎలాంటి కక్ష లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యం వల్లే హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంతవరకు అందుబాటులోకి రాలేవన్నారు మంత్రి గంగుల కమలాకర్. హుజూరాబాద్ పరిధిలో నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయితే ఇప్పటికి ఒక్కటి కూడా గృహ ప్రవేశం కాలేదన్నారు. 

''ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలకు మేము స్పందించాల్సిన అవసరం లేదు. అయినా ఈటలపై ముఖ్యమంత్రి ఎటువంటి కక్ష కట్టలేదు... అందుకే మంత్రి పదవులు ఇచ్చారు. హుజూరాబాద్ పట్టణానికి అభివృద్ధి చేయడానికి నిధుల కోసం ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు అడుగలేదు'' అన్నారు. 

read more   పదవుల కోసం పెదవులు మూస్తే నాకు పదవి ఉండేది.. ఈటెల రాజేందర్

''హుజూరాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి ఆగస్ట్ 15 వరకు ఐదు వందల ఇండ్లు అందుబాటులోకి తీసుకొస్తాం. జమ్మికుంట పట్టణంలో కేవలం నూట యాభై ఇల్లు మాత్రమే నిర్మించారు... మిగతా మూడువందల యాభై ఇల్లు ఇంకా ప్రారంభించలేదు. హుజూరాబాద్ నియోజక వర్గం లో రాబోయే అరు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి చేసి నిరుపేదలకు కేటాయిస్తాం'' అని గంగుల స్పష్టం చేశారు. 

''హుజూరాబాద్ పట్టణంలో డ్రైనేజ్ సిస్టం సరిగ్గా లేక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పట్టణంలో ఉన్న హైవే రోడ్, సైదాపూర్ రోడ్డు ను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తాం. ఇంతకాలం పట్టణంలో ఆశించిన స్థాయిలో అభివృధ్ధి జరుగలేదు... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ'' అన్నారు. 

''డబుల్ బెడ్రూం ఇల్లు పూర్తి చేసి పారదర్శకంగా నిరుపేదలకు అందిస్తాం. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ బొమ్మను చూసే ప్రజలు ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తోంది'' అని గంగుల తెలిపారు. 


 

click me!