‘‘ సఫాయన్నా నీకు సలాం ’’... ఇకపై పీఆర్సీ తరహా జీతభత్యాలు: సీఎం కేసీఆర్‌

By Siva KodatiFirst Published Jun 27, 2021, 8:43 PM IST
Highlights

ఎవరూ డిమాండ్ చేయకున్నా సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష భేటీలో ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఎవరూ డిమాండ్ చేయకున్నా సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష భేటీలో ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తనది సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదమని, వారు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని ముఖ్యమంత్రి అన్నారు. 

తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలని కేసీఆర్ సూచించారు. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని కోరారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను వేరువేరుగా సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. 

Also Read:దళితులకు సామాజిక ఆర్ధిక బాధలు పోవాలి:అఖిలపక్షంలో కేసీఆర్

ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని కేసీఆర్‌ వెల్లడించారు. ‘ దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సాయం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. 

click me!