
ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ ఏర్పడలేదన్నారు. వందల మంది పోరాడితేనే సోనియా గాంధీ ఇచ్చారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పటికీ అసంపూర్ణంగానే వున్నాయని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అసెంబ్లీని 28 రోజులు నడపలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17.39 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికీ ప్రజలకు న్యాయం జరగలేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు . నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్లకు పెండింగ్లో వున్న బిల్లులను చెల్లించాలని ఆయన కోరారు.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు అసెంబ్లీలో ప్రసంగించారు. లౌకిక భావాలు కలిగిన నాయకత్వం దేశానికి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నెహ్రు నాయకత్వం దేశానికి లేకపోతే ఈ రోజున దేశం ఏ పరిస్థితిలో ఉండేదోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.టెక్నాలజీ సహయంతో దేశాన్ని గొప్పగా తీర్ధిదిద్దడంలో నెహ్రు ముందున్నారని ఆయన గుర్తు చేశారు. నెహ్రును ఆదర్శంగా తీసుకొని పాలన చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క సూచించారు.
ALso REad: కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు: మోడీపై అసెంబ్లీలో భట్టి విమర్శలు
దేశ సంపదను ప్రధాని మోడీ తన మిత్రులకు దోచిపెడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశాన్ని ధనిక , పేద వర్గాలుగా విభజిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణానది జలాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పేదలపై ప్రధాని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. బహుళ జాతి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ. 11 లక్ష కోట్ల మాఫీ చేసిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కార్పోరేట్ల చేతిలో పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి సైంటిపిక్ ఆలోచన లేదని.. కరోనా వస్తే చప్పట్లు సలహా ఇచ్చారన్నారు.ప్రభుత్వ సంస్థలన్నీ విక్రయిస్తున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు.