కేసీఆర్‌కు మద్ధతుగా టీఆర్ఎస్‌ నేతల ప్రెస్‌మీట్.. అడ్డుకున్న ఈటల వర్గీయులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published May 16, 2021, 5:43 PM IST
Highlights

హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం వీరి మధ్య వైరం ఒకరినొకరు అడ్డుకునే స్థాయికి చేరింది

హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం వీరి మధ్య వైరం ఒకరినొకరు అడ్డుకునే స్థాయికి చేరింది.

దీంతో పోటీపడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నాయకులు. ఆదివారం వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

విషయం తెలుసుకున్నఈటల రాజేందర్ వర్గీయులు అక్కడికి చేరుకొని కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల అండదండలతోనే బాలకిషన్ రావు ప్రెస్‌మీట్ పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ఈటల రాజేందర్ ఫొటోతోనే గెలిచాం: దేసిన స్వప్న సహా 13 మంది కౌన్సిలర్లు

దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈటల వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఈటల వర్గీయులను పోలీసులు అక్కడి నుండి తరలించారు.

నిన్న మొన్నటి వరకు ఒకటే పార్టీలో ఉన్న నాయకులు మారిన పరిణామాలతో ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం హుజురాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా తన సన్నిహితులు, అనుచరులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 

click me!