Konijeti Rosaiah Death: రోశయ్య పార్థీవదేహానికి నివాళులర్పించిన సీజేఐ ఎన్వీ రమణ..

By team teluguFirst Published Dec 4, 2021, 4:23 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) పార్థీవ దేహానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana)నివాళులర్పించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) పార్థీవ దేహానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana)నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తిని కోల్పోవడం బాధకరమని అన్నారు. క్రమశిక్షణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజు హద్దు మీరి వ్యవహరించలేదన్నారు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా కళలు, సాహిత్యంపై అభిమానం ఉన్న వ్యక్తన్నారు. ఆయన సేవలు మరువలేనివని, అన్ని పదవులకు వన్నె తీసుకువచ్చారన్నారు. అర్ధశతాబ్ధానికిపైగా రోశయ్య ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు. 

ఇంకా రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, వీహెచ్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు,  బీజేపీ నేత ఈటల రాజేందర్, ప్రజాగాయకుడు గద్దర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. 

Also read: konijeti rosaiah Death: దివికేగిన రాజకీయ దిగ్గజం.. రోశయ్యకు ప్రముఖుల నివాళి (ఫోటోలు)

సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
రోశయ్య మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు.  ‘రోశయ్య పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. 

రోశయ్య మృతి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం.. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో కొద్ది రోజులు కర్ణాటక ఇంచార్జ్ గవర్నర్‌గా సేవలు అందించారు. 

click me!