
హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ పర్యావరణం, ప్రకృతిపై అవగాహన కల్పించేలా చిత్రించిన కార్టూన్ల కలెక్షన్ ‘హరితహాసం’ను సీఎం కేసీఆర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రెడ్డి ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రేరణగా తీసుకుని మృత్యుంజయ ఈ కార్టున్ల(ట్రీ టూన్స్-హరితహాసం)ను గీశారు.
పర్యావరణ పరిరక్షణ, హరితవనాన్ని పెంచే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించారు. మొక్కలు నాటడం, పర్యావరణ సమతుల్యతకు గల ప్రాధాన్యతను ఈ కార్టూన్లను వెల్లడిస్తున్నాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్కు ఐదేళ్లు నిండిన సందర్భంలో హరితహాసంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొక్కుల నాటడంపై అవగాహన పెంచేలా 300 కార్టూన్ల కలెక్షన్ ఇది అని సీఎం కేసీఆర్ అన్నారు. కార్టూనిస్ట్ మృత్యుంజయ పై సీఎం ప్రశంసలు కురిపించారు. ఆయన గీసిన హరిత తెలంగాణ చిత్రాన్ని సీఎం కేసీఆర్కు మృత్యుంజయ బహూకరించారు.
Also Read: మాకు కేటాయించే సీట్ల గురించి తేల్చండి: త్వరలో కేసీఆర్తో వామపక్ష పార్టీల నేతల భేటీ
కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూన్లు ప్రజలు రాజకీయ కోణంలోనే కాదు.. సామాజిక కోణంలో ఆలోచించడానికి పురికొల్పుతాయని ఆశిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఒక్క మొక్కతో మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి చేరువైందని, కోట్ల మొక్కలు నాటడం వీలైందని వివరించారు. తెలంగాణ ఉద్యమం నుంచి సామాజిక కార్యకర్తగా ఉన్న మృత్యుంజయ ఇప్పుడు గ్రీన్ ఇండియా చాలెంజ్ను మరింత పాపులర్ చేయడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. త్వరలోనే తాను ఈ కార్టూన్లతో ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తానని తెలిపారు.
సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు కరుణాకర్, రాఘవ, తదిరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.