రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ .. మొన్న నలుగురు, ఇవాళ ఈయన .. అసలేం జరుగుతోంది..?

By Siva KodatiFirst Published Jan 28, 2024, 6:30 PM IST
Highlights

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఆదివారం సీఎం నివాసానికి వెళ్లిన ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

కాగా.. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు‌లు ముఖ్యమంత్రిని కలిసినవారిలో వున్నారు. దీంతో వీరు నలుగురు కారు దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

Latest Videos

దీనికి కొన్ని గంటల ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మిగలరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలంతా జైళ్లకు వెళ్లడం ఖాయమని, కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత జైలుకు పోయే మొట్టమొదటి వ్యక్తి జగదీష్ రెడ్డేనని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే తాము ఆయనను కలిశామని దీనిపై ఎవరికి వారు నచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని, తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని సునీత స్పష్టం చేశారు.

తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామని సునీత తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ .. అంతకుముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరామని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయ్యింది. 

click me!