ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చేసినా ఎవరికి నష్టం లేదన్న రేవంత్ రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 9:48 AM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా.. దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కనుక ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారం నుంచి సోమవారం రోజున పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలపునిచ్చారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. 

ఇక, హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా బుధవారం రోజున ములుగు జిల్లా రామప్ప ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. చారిత్రక రామప్ప ఆలయాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్‌గా ప్రకటించినప్పటికీ అభివృద్ధి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ములుగులో రాత్రి జరిగిన రోడ్‌షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని.. త్యాగాలు చేసిన ఒక్క కుటుంబానికి కూడా ప్రయోజనం లేదని రేవంత్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా.. దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కనుక ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ నిర్మించారని విమర్శించారు.  ప్రగతి భవన్‌ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందరి ఆరోపించారు. పేదలకు మాత్రం ప్రవేశం లేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చివేసిన ప్రజలకు ఒరిగే నష్టం ఏం లేదన్నారు. 

click me!