
సిరిసిల్ల : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఇక ఒకే పార్టీలోని నాయకుల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇంతకాలం కలిసి వున్నట్లు ప్రజలను నమ్మించిన నాయకుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. ఇలా ఐటీ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, సీనియర్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు మధ్య అధిపత్య పోరు బయటపడింది.
వేములవాడ అసెంబ్లీ సీటును ఆశిస్తున్న బిఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనరసింహారావు సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు.సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఎమ్మెల్యే తన వ్యాపారాల కోసం విదేశాల్లోనే ఎక్కువగా వుంటూ నియోజకవర్గ అభివృద్దిని, గెలిపించిన ప్రజలను మరిచాడని ప్రతిపక్షాల ఆరోపణలు అధికార పార్టీని ఇబ్బంది పెడుతన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి వేములవాడ టికెట్ రమేష్ బాబుకు కాకుండా తనకే వస్తుందన్న ధీమాతో చల్మెడ వున్నారు.
వీడియో
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా నిలిచారు. ఇలా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారుచేసుకున్న చల్మెడ తాజాగా పార్టీ కార్యాలయాన్నే ఏర్పాటుచేసి అందరికీ షాకిచ్చాడు. ఈసారి రమేష్ బాబుకు కాకుండా చల్మెడకు వేములవాడ టికెట్ ఇవ్వాలని బిఆర్ఎస్ అదిష్టానాన్ని కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు ఏర్పాటుచేసుకున్న కార్యాలయ ప్రారంభోత్సవానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, కొనరావుపేట, సనుగుల సింగిల్ విండో చైర్మన్లు బండ నర్సయ్య యాదవ్,జలగం కిషన్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తీగల రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్, మాజీ సెస్ డైరెక్టర్ గజనంద రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ... తన వ్యక్తిగతంగానే కార్యాలయాన్ని ఏర్పాటు చేసానని తెలిపారు. తనపై అభిమానంతో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే వేములవాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమని అన్నారు. ఇప్పటికే తాను పుట్టిపెరిగిన వేములవాడలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టానని... బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశమిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని చెల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు.