
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై చర్యలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. మంత్రి హరీశ్రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న అధిష్టానం .. ఏ క్షణమైనా క్రమశిక్షణా చర్యలు ప్రకటించే అవకాశం వుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవితలు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.
అంతకుముందు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం కేసీఆర్. మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్నారు. పార్టీ ఆదేశాలు పాటించకపోతే ఆయన ఇష్టమన్నారు. పోటీ చేస్తారా , చేయరా అనేది మైనంపల్లికే వదిలేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
ALso Read: పోటీ చేస్తారా, చేయరా అనేది ఆయన ఇష్టం : మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందన
అటు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవంతో నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సదరు ఎమ్మెల్యే ప్రవర్తనను తాను ఖండిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
మనమంతా హరీశ్కు బాసటగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి హరీశ్ అంతర్భాగంగా వున్నారని.. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారని హరీశ్కు బాసటగా నిలిచారు కేటీఆర్. సిరిసిల్ల నుంచి తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతూ వుంటాయన్నారు.