తమ్ముళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న.. అతడికీ అంటుకున్న మంటలు.. చివరికి..

By SumaBala BukkaFirst Published Jun 24, 2022, 8:39 AM IST
Highlights

ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్థల వివాదం ఇద్దరు చిన్నారుల జీవితాలతో ఆడుకుంది. బాబాయి కొడుకులు.. అన్నాదమ్ములు.. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా ఓ వ్యక్తి వారిమీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

ఖమ్మం : ఇంటి స్థలం వివాదం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అది ముదిరి పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు Cases పెట్టుకునే వరకు వెళ్ళింది. గొడవలు ఎక్కువ కావడంతో పెద్దోడి కుమారుడు పగతో రగిలిపోయాడు. ఎలాగైనా బాబాయ్ కుటుంబంపై కక్ష తీర్చుకోవాలని అదను కోసం ఎదురు చూస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నాన్న కుమారులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో అతడికీ మంటలు అంటుకున్నాయి. ఖమ్మంలోని 39వ డివిజన్ మేదర బజారుకు చెందిన కోనా చిలకారావు, కోనా  శ్రీనివాసరావు అన్నదమ్ములు. 

వీరు ఉంటున్న ఇళ్లకు సమీపంలోని ఓ ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా ఘర్షణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంవత్సరం క్రితం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాంతో అప్పటి నుంచి పగ పెంచుకున్న చిలకారావు కుమారుడు ఉమా రాజశేఖర్ ఎలాగైనా తన బాబాయ్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం  శ్రీనివాసరావు ఇంట్లో లేడు. ఆయన కుమారులు భార్గవ్ (15),  వీరేందర్ (12) అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. పుస్తకాలు కావాలని వాళ్ల  అమ్మను అడిగారు. దాంతో పుస్తకాలు కొనేందుకు ఆమె బయటకు వెళ్లింది.  

హైద‌రాబాద్ లాడ్ బ‌జార్ గాజుల‌కు జీఐ గుర్తింపు.. అధికారిక ప్ర‌క‌ట‌నే త‌రువాయి..

అది గమనించిన రాజశేఖర్ పెట్రోల్ తీసుకుని  శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్ళాడు. టీవీ చూస్తున్న పిల్లలు భార్గవ్, వీరేందర్ లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పిల్లలు మంటల్లో చిక్కుకుని కాలిపోతూ కేకలు వేశారు. పెట్రోలు పోసి నిప్పంటించే క్రమంలో ఉమాశంకర్ కు కూడా మంటలు అంటుకున్నాయి. దాంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారి కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పి, ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురి శరీరం సుమారు 70 శాతం కాలిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ పేలి, మంటల తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.  

ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న పిల్లల వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న పిల్లల నుంచి జడ్జి శాంతిలత  వాంగ్మూలం తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు ఆ బాధను తట్టుకోలేక రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అది చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

click me!