
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతుంది. ఇటీవల మోదీ పర్యటన, ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. హైదరాబాద్ అన్నోజిగూడ ఆర్వీకేలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు శిక్షణ ఇవ్వనున్నారు.
ఒక్కో జాతీయ నేత సుమారు 40 నుంచి 50 నిమిషాలు పాటు క్లాస్ లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, లక్ష్యాలు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతంపై శిక్షణ ఇవ్వనున్నారు. మూడు రోజులపాటు శిక్షణ ప్రాంగణంలోనే రాష్ట్ర నాయకత్వం బసచేయనుంది. శిక్షణా తరగతులకు బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్ ఛార్జ్ అరవింద్ మీనన్లతో శిక్షణ ఇచ్చే జాతీయ నిపుణులు హాజరుకానున్నారు.
ఇక, శిక్షణా తరగతుల నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. శిక్షణ తరగతుల నిర్వహణతో పాటు, ఇటీవల జరిగిన మోదీ పర్యటన, తదితర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు నవంబర్ చివర్లో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది.