సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు: టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్

By narsimha lodeFirst Published Mar 27, 2022, 1:20 PM IST
Highlights

సింగరేణి ప్రైవేటీకరిస్తారని కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి రాసిన లేఖను  ఆయన  మీడియాకు విడుదల చేశారు.

హైదరాబాద్: సింగరేణి ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని బీజేపీ తెలగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ఇవాళ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీకి Bandi Sanjay ఆదివారం నాడు లేఖ రాశారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయమై తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రచారంపై వాస్తవాలు తేల్చాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. 

Singareni ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని  తప్పుడు ప్రచారం చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు.  మెజారిటీ వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం సాద్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్  మండిపడ్డారు. సంస్థలో Telangana రాష్ట్ర వాటా 51శాతం కాగా కేంద్రం వాటా 49 శాతమేనన్న విషయాన్ని బండి సంజయ్  గుర్తుచేశారు.  రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో KCR, TRS నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతూ లేకుండా పోయిందని సంజయ్ విమర్శించారు. 

బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్రం మైన్స్  మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 ప్రకారం పాదర్శకంగా వేలం వేస్తోందని బండి సంజయ్ చెప్పారు. అయితే 2020లో కమర్షియల్ మైనింగ్ అంశాన్ని చట్టంలో చేర్చడం వల్ల కేవలం వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నారని స్పష్టం చేశారు.

 సింగరేణి ప్రాంతానికి చెందిన 4 block వేలం వేయగా ఎవరూ బిడ్లు వేయలేదన్నారు. సింగరేణి సంస్థ ఆ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుని పొందవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్దాలను ఆ ప్రాంత ప్రజలు, కార్మికులు నమ్మొద్దని సంజయ్ కోరారు. 

సీఎం కేసీఆర్ రోజుకో మాట పూటకో అబద్దమాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. జిత్తులమారి ఎత్తులతో రైతులు, విద్యార్థులు, కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన సీఎం కేసీఆర్ తన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీపై తప్పుడు ప్రచారం  చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

 

click me!