దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు.
దుబ్బాక: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు.
గురువారం నాడు ఆయన రఘునందన్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు.దుబ్బాకలో బీజేపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. సిద్దిపేట సీపీని చనిపోయిన పోలీసు అమరవీరులు సిగ్గుపడాలన్నారు.
తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు ఆర్పించారన్నారు. ఇలా ప్రాణాలు తీసుకొన్న శ్రీకాంతాచారి ఏబీవీపీ సభ్యుడని ఆయన గుర్తు చేసుకొన్నారు.ముఖ్యమంత్రి అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలని ఆయన దుబ్బాక ప్రజలను కోరారు. ఇంటర్ విద్యార్ధులు చనిపోతే కనీసం కేసీఆర్ సంతాపం ప్రకటించలేదన్నారు.
సమ్మె కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే కూడ ఆయన కనీసం కన్నీరు కార్చలేదని చెప్పారు.దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపిస్తే మల్లన్నసాగర్ నిర్వాసితులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు.
ప్రజల ఆదరణను చూస్తే ఈ నియోజకవర్గంలో రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమాను ఆయన వ్యక్తం చేశారు.