అభివృద్ది కోసమే మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: తేల్చేసిన బండి సంజయ్

By narsimha lodeFirst Published Aug 5, 2022, 11:39 AM IST
Highlights

అబివృద్ది .పనుల కోసమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరితో కూడా చర్చించలేదన్నారు. 
 

హైదరాబాద్:భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy పార్టీలో చేరుతానని తమ పార్టీకి చెందిన ఎవరితో చర్చించలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay తేల్చి చెప్పారు. ఈ విషయమై తమ పార్టీ నేతలతో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కాలేదన్నారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ ఇచ్చారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా  మీడియాతో బండి సంజయ్ చిట్ చాట్ చేశారు.ఈ చిట్ చాట్ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కలకలం రేపాయి.

also read:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా వాడే: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరణ

శుక్రవారం నాడు బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు.  చిట్ చాట్ సందర్భంగా తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరును తీసుకోలేదన్నారు. అభివృద్ది కార్యక్రమాల విషయమై ప్రధాని నరేంద్ర మోడీ సహా, పలువురు మంత్రులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అవుతారని ఆయన చెప్పారు. ఎవరు అపాయింట్ మెంట్ అడిగినా కూడా ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తారని  బండి సంజయ్ చెప్పారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా మోడీ వ్యవహరించరన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరని ఆయన విమర్శించారు ప్రధాని మోడీ మాత్రం ఇందుకు భిన్నమన్నారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి పొలిటిషీయన్, మంచి వ్యక్తి అని బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుమారు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  రాజీనామా చేయనున్నారని కూడా బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురువారం నాడు మీడియా ప్రతినిధుల చిట్ చాట్ సందర్భంగా చెప్పారు. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ుప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ నాయకత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో  బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. 

బీజేపీలో చేరే నేతల జాబితాను ఇటీవల ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి అందించారు. ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం జేపీ నడ్డాతో పాటు పలువురు అగ్రనేతలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆయా పార్టీల నేతలు  బీజేపీలో చేరే విషయమై చర్చించారు. 

తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు గాను బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆయా పార్టీల్లోని అసంతృప్త నేతలతో బీజేపీ నాయకత్వం చర్చిస్తుంది. ఇటీవలనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరనున్నారు. మరికొందరు నేతలు కూడా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని కమలదళం నేతలు చెబుతున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ఆ పార్టీలో మరింత ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది. 


 

 

click me!