దత్తన్న కూతురికి బీజేపీ మొండిచేయి: ముషీరాబాద్ నుండి రాజుకు కమలం టిక్కెట్టు

By narsimha lodeFirst Published Nov 2, 2023, 3:33 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆ మహిళ నేతలకు  నిరాశే మిగిలింది. కమలదళం  టిక్కెట్లు నిరాకరించింది. ముషీరాబాద్ ,సికింద్రాబాద్ ల నుండి  టిక్కెట్లు దక్కని మహిళా నేతల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.

హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ  కూతురు విజయలక్ష్మికి  బీజేపీ మొండిచేయి చూపింది. ముషీరాబాద్  అసెంబ్లీ స్థానం నుండి విజయలక్ష్మి  బీజేపీ టిక్కెట్టును ఆశించింది. కానీ,ఈ స్థానంలో బీజేపీ టిక్కెట్టు దక్కలేదు. ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు కోసం  విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ముషీరాబాద్ నుండి పూస రాజుకు బీజేపీ నాయకత్వం టిక్కెట్టును కేటాయించింది.

 సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  బండారు దత్తాత్రేయ  పలు దఫాలు విజయం సాధించారు.  కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో బండారు దత్తాత్రేయ  కూతురు విజయలక్ష్మి  క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ముషీరాబాద్ నుండి పోటీకి ఆమె రంగం సిద్దం చేసుకుందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ స్థానం నుండి  రాజుకు  బీజేపీ టిక్కెట్టుకు కేటాయించింది.

బండ కార్తీకరెడ్డికి నిరాశే

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ అసెంబ్లీ సీటును బండ కార్తీక రెడ్డి ఆశించారు.  ఈ స్థానం నుండి  మేకల సారంగపాణికి బీజేపీ కేటాయించింది. దీంతో బండ కార్తీకరెడ్డి అసంతృప్తికి గురయ్యారు.  కొద్దిసేపట్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో  బీజేపీ అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో  కర్ణాటకలో  బీజేపీ అధికారానికి దూరమైంది. దీంతో తెలంగాణలో  అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలో  గత కొంతకాలంగా  పార్టీ జాతీయ నాయకత్వం ఫోకస్ ను పెంచింది. గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలు రావడంతో  బీజేపీ నాయకత్వం  తెలంగాణపై  కేంద్రీకరించింది.

also read:24 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా యాదవ్: అంబర్ పేట నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి

తెలంగాణలో అధికారాన్ని చేపడితే  బీసీలకు సీఎం పదవిని ఇస్తామని  కమలదళం ప్రకటించింది.  సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.  పార్టీ ప్రకటిస్తున్న అభ్యర్ధుల జాబితాలో  బీసీలకు పెద్ద పీట వేస్తుంది.  అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయ కూతురుకు బీజేపీ టిక్కెట్టు మాత్రం కేటాయించలేదు.  దత్తాత్రేయ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడంతో  దసరా మరునాడు నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని  విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కూడ విజయలక్ష్మి  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు పార్టీల నేతలను  ఈ కార్యక్రమానికి ఆమె ఆహ్వానించారు. 
 

click me!