శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జేపీ నడ్డా.. కాసేపట్లో మిథాలీ‌రాజ్‌తో బీజేపీ చీఫ్ బేటీ..

By Sumanth KanukulaFirst Published Aug 27, 2022, 1:17 PM IST
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జేపీ నడ్డాతో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్‌కు వచ్చారు. ఇక, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా శంషాబాద్‌‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడే భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ కానున్నారు. ఇందుకోసం మిథాలీరాజ్ ఇప్పటికే నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. 

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. అక్కడ బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి జేపీ నడ్డా వెళ్లనున్నారు.  అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుంటారు. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. 

దాదాపు గంటకు పైగా జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం నోవాటెల్‌ హోటల్‌లో హీరో నితిన్‌తో సమావేశం కానున్నారు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు, కవులు, రచయితలతో జేపీ నడ్డా సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే నితిన్, మిథాలీరాజ్‌‌, ఇతర ప్రముఖు‌లతో భేటీ కానున్న జేపీ నడ్డా వారితో ఏ అంశాలు చర్చిస్తారనే విషయం మాత్రం స్పష్టంగా తెలియడం రాలేదు. 

click me!