
టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ద్వారా భారత సమగ్రతను అవమానించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో కేసీఆర్ను ప్రశంసిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అందులో కొన్నింటిలో భారతదేశం మ్యాప్ను తప్పుగా పొందుపరిచారని ధర్మపురి అరవింద్ చెప్పారు. ఈ మేరకు కొన్ని ఫ్లెక్సీల ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ధర్మపురి అరవింద్.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భారత్ మ్యాప్ను తప్పుగా చూపించిందని.. ఇది మన రాజ్యాంగాన్ని, భారత సమగ్రతను అవమానించడమేని అన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మన దేశ భూభాగం నిర్వచించబడిందని.. మొత్తం జమ్మూ- కాశ్మీర్ భారతదేశంలో భాగమేనని చెప్పారు. కానీ ఇక్కడ పీఓకేను భారత మ్యాప్ నుంచి తొలగించడం ద్వారా పాకిస్థాన్కు మద్దతిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ద్వారా ప్రచారం చేయబడుతున్న ఇండియా మ్యాప్ ఫొటోను కూడా షేర్ చేసిన అరవింద్.. హైదరాబాద్ను పాకిస్తాన్లో విలీనం చేయాలని భావించిన నిజాం వారసత్వాన్ని కేసీఆర్ అనుసరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వెనక ఉద్దేశం ఇదేనా అని ప్రశ్నించారు.