తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘునందన్ రావు.. నోటీసులకు భయపడేది లేదని కామెంట్..

Sumanth KPublished : Jun 3, 2023 5:20 PM

ఓఆర్‌ఆర్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి చాలా చూశానని చెప్పారు. 

ఓఆర్‌ఆర్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి చాలా చూశానని చెప్పారు. రఘునందన్ రావు శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమలశ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు పడతాయని బాగుపడతాయని సబ్బండ వర్గాల ప్రజలు భావించారని చెప్పారు. అయితే అలా జరగడం లేదని అసంతృప్తి ప్రజల్లో ఉందని.. దానిని దూరం చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉందని చెప్పారు. 

తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులకు అంతా బాగుండాలని శ్రీవెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టుగా చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా తాను పోరాడుతున్నట్టుగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుండటంతో.. ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ మీద మాట్లాడటం జరిగిందని చెప్పారు. తనపై కేసులు పెడితే, నోటీసులు ఇస్తే భయపడేది లేదని తెలిపారు. రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ టోల్ గేటు కాంట్రాక్టును రూ.66 లక్షలకు ఎందుకు కట్టబెట్టారని  మాత్రమే ప్రశ్నించానని.. తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పారు. 

తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన నాలాంటి వ్యక్తికి కోర్టులు, నోటీసులు కొత్త కాదని అన్నారు. ఇలాంటి వాటితో తనను భయపెట్టలేరని.. ఐఆర్బీ సంస్థ నన్ను ఇబ్బంది పెట్టలేదని అన్నారు. న్యాయపరంగానే వాటిని ఎదుర్కొంటానని చెప్పారు. 

Read more Articles on
click me!