కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాల్లో చేయని ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని అడిగారు.
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ తాజాగా ప్రకటించిన రైతులకు రుణమాఫీ పైనా సంశయాలు వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చేయని రుణమాఫీ.. ఈ రెండు నెలల్లో చేస్తారా? అంటూ అడిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునే కుట్ర జరుగుతున్నదని అన్నారు. అందుకోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీలో 56 వేల మంది ఉన్న కార్మికులకు 43 వేలకు తగ్గిపోయారని, 12 వేల బస్సుల నుంచి మూడు వేల బస్సులకు సంఖ్య పడిపోయిందని ఆయన అన్నారు. ఒక వేళ ఆర్టీసిని ప్రభుత్వంలో కలిపేస్తే.. ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా ఆర్టీసీలో పనులు చేస్తున్న వారి పరిస్థితి ఏమిటనీ అడిగారు.
అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేయడాన్ని ఈటల రాజేందర్ తప్పు పట్టారు. రాష్ట్రంలో వరదలు మొదలు అనేక సమస్యలు ఉన్నాయని, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఆరు నెలలకు ఓ సారి సమావేశాలు నిర్వహించాలి కాబట్టే.. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహించారు.
Also Read: బీజేపీలోకి చీకోటి ప్రవీణ్.. బండి సంజయ్ సహా పలువురు నేతలతో భేటీ !
కాళేశ్వరం ప్రాజెక్టుతో బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు నష్టపోతున్నాయని, ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాతే ఈ సమస్య ఉత్పన్నమైందని ఈటల రాజేందర్ అన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న బాధితులకు రూ. 25 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విజ్ఙప్తి చేసినా కనీస స్పందన లేదని వాపోయారు. అలాగే, రాష్ట్రంలో మంత్రులంతా డమ్మీలుగా మారారని ఆరోపించారు. ఎవరు కూడా సీఎం కేసీఆర్ గీసిన గీత దాటకుండా ఉన్నారని వివరించారు.