
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి గత చరిత్ర అందరికి తెలిసిందేనని అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజల్లో బ్లాక్ మెయిలర్ అనే పేరు ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అలాంటి రేవంత్ ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తే నమ్మేదవని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి చీకటి వ్యాపారం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేక రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలును రుజువు చేయాలని సవాలు విసిరారు. తాను రేవంత్పై పరువు నష్టం కేసు వేయనున్నానని.. ఆ కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖామని అన్నారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇందుకు సాక్ష్యాలు అయితే తాను అందించలేనని చెప్పారు. కానీ ఇది వాస్తమని అందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకే నాణేనికి రెండు ముఖాలనీ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గానీ.. ఆ తర్వాత గానీ రెండు పార్టీలు చేతులు కలుపుతాయని జోస్యం చెప్పారు.
అయితే ఈటల రాజేందర్ కామెంట్స్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ నుంచి గానీ, కేసీఆర్ నుంచి గానీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల శ్రమను, వారి మద్దతును ఈటల రాజేందర్ అవమానించారని మండిపడ్డారు. రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతున్నాయని విమర్శించారు.
తాము ఎటువంటి డబ్బు తీసుకోలేదని నిరూపించేందుకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తాము డబ్బు తీసుకున్నామని ఈటల కూడా ప్రమాణం చేయాలని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సవాలు విసిరారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. అయితే రేవంత్ సవాలుపై ఈటల రాజేందర్ వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన వెలువడలేదు.