
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల వివాదం కాకరేపుతోంది. రేవంత్ (revanth reddy) వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగా (komatireddy venkatreddy) చేరికల వ్యవహారం సాగుతోంది. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (erra sekhar) వచ్చారు. రేవంత్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్ర శేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్ ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో వున్నారు కోమటిరెడ్డి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా చేరికను సమర్ధించారు.
కాగా... తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎర్రశేఖర్ ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. టీడీపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతర పరిణామాలతో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ అక్కడి నేతలతో పొసగకపోవడంతో .. ఎర్ర శేఖర్ కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.
Also REad:ఎర్ర శేఖర్ కి ఊరట: సోదరుడు జగన్మోహన్ హత్య కేసు కొట్టివేత
గతంలో మహబూబ్ నగర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించిన పొడపాటి చంద్రశేఖర్కు ఎర్ర శేఖర్ కుటుంబంతో బంధుత్వం ఉంది. పొడపాటి చంద్రశేఖర్ ఎన్టీఆర్, చంద్రబాబ కేటినెట్లలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్ కు కేటాయించడంతో చంద్రశేఖర్ పోటీకి దూరంగా ఉన్నారు. 2014 తర్వాత చంద్రశేఖర్ టీడీపీని వీడారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.