
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ మహాధర్నాలో టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మహాధర్నా ప్రారంభం సందర్భంగా బండి సంజయ్ మట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలుత పేపర్ లీకేజ్కు కారణం ఇద్దరు మాత్రమే అన్నారని.. మరి ఇప్పటివరకు 20మందికి నోటీసులు ఎందుకు జారీచేశారని బండి సంజయ్ ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులిస్తున్నారన్నారు. తనను ఈ రోజు సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. పేపర్ లీక్కు బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దని సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఇక, ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక, బీజేపీ మహా ధర్నా నేపథ్యంలో ఇందిరాపార్కు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
ఇక, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువతకు మద్దతుగా బీజేపీ పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్దమైంది. మార్చి 25న ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన ఉద్యోగ ఆశావహులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
అయితే ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ మహా ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.