కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో బీజేపీ సత్తా చాటింది.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలుపు‌: ఈటల రాజేందర్

By Sumanth KanukulaFirst Published Nov 7, 2022, 3:20 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. మునుగోడులో వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. మునుగోడులో వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్‌కు చావుతప్పి కన్నులొట్టబోయినట్లయిందన్నారు. మునుగోడులో ఎంతో కసితో, దుర్మార్గంతో తమపై దాడులు చేశారని ఆరోపించారు. సోమవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటిందని అన్నారు. మునుగోడు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకుంటాడని విమర్శించారు. దానిని తాజా నిదర్శనం కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టడమేనని అన్నారు. 

గతంలో కమ్యూనిస్టు పార్టీలను ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు అన్న కేసీఆర్.. వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే వారిని మచ్చిక చేసుకున్నారని విమర్శించారు. ఉపఎన్నిక రాగానే వారికి ప్రగతి భవన్‌కు పిలిచి విందు ఇచ్చారని చెప్పారు. ఎన్నికల వేళ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఏదైనా చేస్తారని విమర్శించారు. హుజూరాబాద్లో తనను ఓడించాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. మనుగోడులో కూడా ఇదే విధంగా చేశారని ఆరోపించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని.. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు. 

Latest Videos

click me!