తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపురావడంతోనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపురావడంతోనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఈ భేటీలో ఆయన బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీలో పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల, రాజగోపాల్ రెడ్డిలు.. తమ వాదనను వారి ముందు ఉంచారు.
మరోవైపు జేపీ నడ్డా ఆదివారం తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను ఆరా తీయడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే తెలంగాణలో జేపీ నడ్డా పర్యటనకు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు దూరంగా ఉన్నారు. శనివారం పార్టీ అగ్రనేతలతో సమావేశమైన వారు.. ఆదివారం ఢిల్లీలోనే ఉండిపోయారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బండి సంజయ్కు బీజేపీ అధిష్టానం నుంచి ఢిల్లీ రావాల్సిందిగా పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల అంశంపై బీజేపీ అధిష్టానం బండి సంజయ్తో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈటల, కోమటిరెడ్డిలతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా బండి సంజయ్కు వివరించి.. తదుపరి కార్యచరణపై సమాలోచనలు జరిపే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.