
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రెండో జాబితా ప్రకటించడంతో ఆ పార్టీ టిక్కెట్లు ఆశించి దక్కకపోడంతో నిరసనలకు దిగారు. నిజామాబాద్, హైద్రాబాద్లలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
శుక్రవారం నాడు బీజేపీ 28 మందితో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టిక్కెట్లు దక్కని వారు పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు. రెండో జాబితాలో నిజామాబాద్ అర్భన్ స్థానం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు దక్కింది. దీంతో సూర్యనారాయణ వర్గం ఆందోళనకు దిగింది. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రెబెల్గా పోటీ చేస్తామని సూర్యనారాయణ వర్గం తేల్చి చెప్పింది.
మరో వైపు హైద్రాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి టిక్కెట్టును నరేష్, భాస్కర్రెడ్డిలు ఆశించారు. వీరిద్దరిని కాదని యోగానంద్కు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో నరేష్, భాస్కర్రెడ్డిలతో పాటు మరో ముగ్గురు కార్యకర్తలు హైద్రాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం భవనంపై ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా తమ ఇష్టమొచ్చినవారికి టిక్కెట్లు కట్టబెట్టడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం టిక్కెట్లు అమ్ముకొన్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సంబంధిత వార్తలు
28 మందితో బీజేపీ రెండో జాబితా: టిక్కెట్టు కొట్టేసిన సినీ తార