
తెలంగాణలో ఎన్నికల పర్వం మొదలైంది. ఎన్నికల షెడ్యుల్ ని ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో.. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ టీఆర్ఎస్ నేతకు చేదు అనుభవం ఎదురైంది.
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం ఎనుమాముల బాలాజీనగర్ కూడలిలో 12వ డివిజన్ తెరాస ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏంచేశారంటూ స్థానికులు ఆయనను అడ్డుకునే యత్నం చేశారు. ‘‘గోబ్యాక్.. గ్యోబాక్.. మీకు ఓటు అడిగే హక్కులేదు’’ అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ బాలాజీనగర్ వాసులు పెద్దసంఖ్యలో సభాస్థలికి వద్దకు ప్రదర్శనగా తరలివచ్చారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో పెద్దపెట్టున నిరసనలు తెలిపారు. అక్కడ పరిస్థితి తోపులాట జరిగే వరకూ వచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామంటూ నిరసన తెలిపిన యువకులకు అక్కడి మహిళలు మద్దతుగా నిలిచారు.దీంతో పదినిమిషాల పాటు సభావేదికపై కూర్చున్న రమేశ్ అర్ధంతరంగా వెళ్లిపోయారు.